ఆర్టీసీ బస్సులో ప్రేమ జంట ఆత్మహత్య..

బుధవారం, 17 నవంబరు 2021 (18:35 IST)
తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి ఓ బాలక తనువు చాలించింది. ఆర్టీసీ బస్సులో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట నియోజక వర్గంలోని చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకు చెందిన అనూష (14) చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ, తరగతి చదువుతుంది.  అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జగ్గారావు (28) తరుచూ పాఠశాలకు వచ్చేవాడు. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అనూష కనిపించకపోవడంతో ఆమె తండ్రి సోమేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
 
ఇదిలా ఉండగా కొత్తగూడెం డిపోకి చెందిన ఆర్టీసి బస్సులో జగ్గారావు, అనూషలు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఇద్దరూ కనిపించారు. దాంతో డ్రైవర్ గమనించి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. స్పందించిన పోలీసులు ఆ జంటను అశ్వారావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఇరువురి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు