తన మంత్రివర్గం నుంచి వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి రాజయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించడం మాదిగ జాతిని అవమానించడమేనని టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియకుండా ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై రాజయ్య ప్రకటన చేశారని దీంతో ఆయనను మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో బర్తరఫ్ చేశారన్నారు.
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంది దళితులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. మాదిగ కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచారంటూ కితాబు ఇస్తూ, ఆయన బర్తరఫ్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో చెప్పాలని కేసీఆర్కు మోత్కుపల్లి సవాల్ విసిరారు.