ముత్యాలు మెడకు చున్నీ బిగించి చంపేసిన భార్య - ప్రియుడు

మంగళవారం, 15 జూన్ 2021 (08:16 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్యను చంపేసింది. భర్త మెడకు చున్నీ బిగించి ప్రాణాలు పోయేంతవరకు గట్టిగా లాగి పట్టుకుంది. దీంతో భర్త ప్రాణాలు విడిచాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేళ్ళ చెరువు మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి అనే మహిళకు అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌ అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఆమె భర్త ముత్యాలు (28)కి తెలిసింది. దీంతో భార్యను ఆయన పలుమార్లు హెచ్చరించాడు. 
 
దీంతో భర్తపై భార్య, ఆమె ప్రియుడు పగ పెంచుకున్నాడు. తమ బంధానికి అడ్డు తగులుతున్నాడని భావించిన నాగరాణి ప్రియుడు నవీన్‌తో కలిసి భర్త ముత్యాలును హత్య చేసేందుకు పథకం రచించారు. తమ ప్లాన్‌లో భాగంగా, ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు. 
 
ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలను పూర్తిచేయించింది. అయితే, ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది. 
 
దీంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ముత్యాలును హత్య చేసింది భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు