పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలు.. నేతల నివాళులు

మంగళవారం, 28 జూన్ 2022 (15:48 IST)
దేశ మాజీ ప్రధాని వీపీ నరసింహా రావు 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని వీపీ ఘాట్‌కు అనేక మంది నేతలు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో సహా అనేక మంది ప్రముఖులు, పీవీ కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దేశం క్లిష్ట సమయంలో ఉన్నపుడు అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కొనియాడారు. ప్రధానమంత్రిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానేకాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక పురోభివృద్ధి సాధించిందని కొనియాడారు. 
 
అలాగే, దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడివుందన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తి తో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ తెలిపారు.
 
అలాగే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నరసింహారావు అని అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్‌కు ఆయన నివాళులు అర్పించారు. ఢిల్లీలో వీపీ స్మృతి మందిర్ నిర్మాణం చేస్తామన్నారు. ఢిల్లీ పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పీవీ చరిత్ర నేటి బాలలకు తెలిసేలా పుస్తకాలను ముద్రిస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు