సెండాఫ్ ఇచ్చేందుకు ఎయిర్ పోర్టుకు ముగ్గురు కంటే ఎక్కువ మంది రావొద్దు..

ఆదివారం, 13 ఆగస్టు 2023 (16:53 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో వారికి వీడ్కోలు చెప్పేందుకు వందలాది మంది విమానాశ్రయానికి వస్తున్నారు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో కొంత మంది ప్రయాణికులు సమయానికి బోర్డింగ్ కాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీడ్కోలు కోసం నలుగురు మాత్రమే రావాలని అధికారులు పేర్కొన్నారు.
 
విదేశాలకు వెళ్తున్న వారి వెంట ఎక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు రావొద్దని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఒక్క ప్రయాణికుడి కోసం సుమారు 10 నుంచి 15 మంది ఎయిర్ పోర్టుకు వస్తుండటంతో భద్రతా సమస్యలతో పాటు పార్కింగ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. దీనికితోడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సీఐఎస్ఎఫ్, స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత 3, 4 రోజులుగా ఎయిర్ పోర్టులో పెరిగిన రద్దీ నేపథ్యంలో పోలీసులు, విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ముందస్తుగా సూచనలు చేశారు. అయినా శనివారం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు