తెరాస సర్పంచ్ భర్తను ఉరితీయాలంటూ మంత్రి కేటీఆర్ ఆఫీస్ ముట్టడి

ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:43 IST)
ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన అధికార తెరాస నేత శంకర్‌ను ఉరి తీయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తెరాస పార్టీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల గిరిజన బాలికపై గ్రామ మహిళా సర్పంచ్ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడు పేరు శంకర్‌. ఈయన్ను ఉరితీయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 
 
కామంతో రెచ్చిపోయి పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సమాజంలో ఉంటే ప్రమాదకరమని, అతడిని వెంటనే ఉరి తీయాలని స్థానికులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన శంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.
 
అయినప్పటికీ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన సంఘాలతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు శనివారం 8 గంటలపాటు ఆందోళన కొనసాగించారు. అయితే తమను ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
 
మరోవైపు నిందితుడు శంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, పోలీసు అధికారులను కోరినట్లు టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు