తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోనే వుంటాయని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది. 2014 ఏపీ పునర్విభజన బిల్లులో అవన్నీ పేర్కొన్నారనీ, కాబట్టి ఆ నియమనిబంధనలు, అధికారాలు గవర్నర్కి కట్టబెట్టామని కేంద్రంలోని మోడీ సర్కార్ మరోసారి ప్రకటించింది. హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని కేంద్రం సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శాంతిభద్రతలు, ఐఏఎస్ అధికారుల క్యాడర్ వర్గీకరణపై గవర్నర్-ప్రధానిల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ వివరించారు. రెండు రోజుల నుంచీ ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.