పోతననగర్లో సారిక, అభినవ్, ఆయోన్, శ్రీయోన్ల అంత్యక్రియలు పూర్తి!
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్ల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. తన భర్త హింసించినా.. అత్తమామలు వేధించినా తన ముగ్గురు కుమారుల్ని అల్లారుముద్దుగా పెంచుకుని.. న్యాయం కోసం పోరాడుతూ వచ్చి.. మంటల్లో తన కుమారుల పాటే సజీవదహనమైన సారిక, ఆమె తనయులకు స్థానిక పోతననగర్లోని శ్మశాన వాటికలో సారిక తల్లి, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
శ్మశాన వాటిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భర్త వుండీ ఆకలితో ఎన్నోసార్లు అలమటించిన సారిక తన పుత్రులను కూడా తన వెంటే తీసుకెళ్లిపోయిందని.. ఆత్మహత్యకు పాల్పడే పిరికిది కాదని.. ఆమెను రాజయ్య కుటుంబీకులే చంపేశారంటూ.. సారిక తల్లి, అక్కయ్య అర్చన, బంధువులు అంటున్నారు. నిందితులకు సరైన శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సారిక, కుమారులు ముగ్గురికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను ఆమె బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ సారికది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం తెలియరాదని పోలీసులు అంటున్నారు.