మున్సిపల్ ఎన్నికలకు రెడీ: హైకోర్టుకు తెలిపిన కేసీఆర్ సర్కార్

శనివారం, 10 ఆగస్టు 2019 (17:22 IST)
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుపై ఈ నెల 13వ తేదీన విచారణ చేపట్టనుంది తెలంగాణ  హైకోర్టు.
 
వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.  రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లోని 69 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
 
 కానీ ఈ విషయమై ఇవాళ మాత్రం రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహిస్తామని  హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలపై విధించిన స్టే కు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించినట్టుగా హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
 
 రాష్ట్రంలోని  అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయమై ఎన్నికల సంఘం కూడ సంసిద్దతను వ్యక్తం చేస్తూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 
 
ఎన్నికల సంఘం కౌంటర్  దాఖలు చేసిన తర్వాత  హైకోర్టు ఏ నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 13వ తేదీన ఈ కేసు విషయమై విచారణ జరగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు