ఆమ్వే వంటి సంస్థలను ప్రోత్సహించవద్దు : అమితాబ్‌కు సజ్జనార్ వినతి

శుక్రవారం, 31 మార్చి 2023 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబా బచ్చన్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. అమెరికాకు చెందిన ఆమ్వే వంటి కంపెనీలను ప్రోత్సహించవద్దని ఆయన హితవు పలికారు. ఈ మేరకు అమితాబ్‍‌తో సహా సెలెబ్రిటీలందరినీ ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. ఆమ్వే వంటి మోసపూరిత సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వీటి కార్యకలాపాలు మన దేశంలో సాగించేందుకు ఏమాత్రం సహకరించవద్దని కోరారు. 
 
దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహించవద్దని ఆయన అభ్యర్థించారు. దీంతో ఈ ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. అయితే, సజ్జనార్ గతంలోనూ సెలెబ్రిటీలకు ఇలాంటి సూచనలు చేశారు. క్యూనెట్ వంటి గొలుసుకట్టు సంస్థలను ప్రోత్సహించవద్దని ఆయన గతంలో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ఇపుడు కూడా ఆమ్వే వంటి సంస్థలను ప్రోత్సహించవద్దని కోరారు. 
 
ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించిన పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆమ్వే తన వస్తువులను మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తుందని గత యేడాది ఏప్రిల్ నెలలో ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ సంస్థ అసలు లక్ష్యం వ్యాపారం కాదని గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నింస్తుందని ఆరోపించిన ఈడీ.. అప్పట్లో ఆమ్వేకు చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు