తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. ఉద్రిక్తత

ఆదివారం, 19 మార్చి 2023 (17:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్ మల్లన్నకు చెందిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఈ కార్యాలయంలోనే ఆయన క్యూ న్యూస్‌ అనే పేరుతో ఓ న్యూస్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 
 
దాడి తర్వాత సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. దాడి ఘటన సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేకపోవడంతో ఆయనకు ప్రాణముప్పు తప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు