సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు : రూ.150 కోట్లు కేటాయింపు

సోమవారం, 2 ఆగస్టు 2021 (13:49 IST)
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. ఏకంగా 150 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. అలాగే, నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. 
 
నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని.. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. 
 
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.  హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు.
 
మరోవైపు, ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నాం. నందికొండ మున్సిపల్‌ క్వార్టర్స్‌, ఇరిగేషన్‌ భూముల్లో ఉన్నవారికి క్రమబద్ధీకరిస్తాం. నెలరోజుల్లో లబ్ధిదారులకు పట్టాలిస్తాం. సాగర్‌ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంజారాలు ఉన్నారు. వారి కోసం బంజారా భవనం నిర్మిస్తాం. రెండేళ్లలో విద్యుత్‌ వ్యవస్థను తీర్చిదిద్ది రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని చెబితే ఆనాడు జానారెడ్డి ఎగతాళి చేశారు. చేసి చూపించాం. దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం. తె
 
లంగాణ ఎస్సీలు దేశానికి ఆదర్శమవుతారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది దళితులు ఉన్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది దళితబంధుకు అర్హులు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బ్యాంకుతో సంబంధం లేకుండా దళితబంధు కింద రూ.10లక్షలు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతాం. ఆరునూరైనా దళితబంధును అమలు చేసి చూపిస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు