మంద నుంచి తప్పిపోయిన మేక... కాపరిని తలకిందులుగా వేలాడదీసి పొగబెట్టారు.. ఎక్కడ?

ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (10:58 IST)
మేకల మంద నుంచి ఒక మేక తప్పిపోయినందుకు తమ వద్ద పని చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది తలకిందులుగా వేలాడదీశారు. అతని కింద పొగబెట్టారు. కేవలం మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడిబజార్ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలను పెంచుతున్నారు. తండ్రి లేకపోవడంతో తేజ (19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా చేస్తున్నాడు. అతడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో 20 రోజుల క్రితం మేకల మంద నుంచి ఒక మేకతో పాటు ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. తేజతోపాటు అతడి దళిత స్నేహితుడు చిలుముల కిరణ్(30)పై యజమాని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరినీ శుక్రవారం షెడ్డుకు పిలిపించింది. ఆ తర్వాత వారిని కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. ఆపై తల కింద నేలపై నిప్పు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. పొగతో ఊపిరాడక వారు నానా యాతన అనుభవించారు. ఆ తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు.
 
రామగుండానికి చెందిన కిరణ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో మందమర్రిలో తన చిన్నమ్మ సరిత వద్ద ఉంటూ నిర్మాణ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్నాడు. శుక్రవారం బయటకు వెళ్లిన కిరణ్ ఎంతకీ రాకపోవడంతో సరిత తీవ్ర ఆందోళనకు లోనైంది. ఇదేసమయంలో, అతడిని చిత్రహింసలకు గురి చేసిన ఫొటోలను చూసి భయపడిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు రాములు, ఇతర కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు