తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: ఉపరాష్ట్రపతి - గవర్నర్ శుభాకాంక్షలు

బుధవారం, 2 జూన్ 2021 (10:18 IST)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగానే జ‌రుగుతున్నాయి. కొవిడ్ విజృంభ‌ణ‌ వేళ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణయించడంతో నేత‌లు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, ప‌లు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణకు మాత్రమే పరిమితం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే, 'రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌దైన‌ సంస్కృతితో, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వంతో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నాను' అని ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.
 
ఇకపోతే, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్‌ 2వ తేదీన రాష్ట్రం ఏర్పడిందని, దీనికోసం ఎంతోమంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని, అనేక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయని తెలిపారు. 
 
కరోనా నిబంధనల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని ఆమె సూచించారు. కాగా, రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల కలల సాకారం చేసేందుకు బీజేపీ నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు