నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయండి : ఉపరాష్ట్రపతి సూచన

శుక్రవారం, 21 మే 2021 (18:33 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొగిని ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్య నిపుణులు పంపిణీ చేస్తున్న కరోనా మందు కోసం వేలాది మంది తండోపతండాలుగా క్యూ కడుతున్నారు. ఈ మందును ఎప్పటి నుంచే పంపిణీ చేస్తున్నప్పటికీ.. గత వారం రోజులుగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 
 
దీంతో ఆనందయ్య ఆయుర్వేద వైద్యం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు సూచనలు చేశారు.
 
కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్‌లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు. 
 
మరోవైపు, ఈమందు కోసం వస్తున్న వేలాది మంది కరోనా రోగులకు ఆనందయ్య ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. గతంలో రోజుకు 500 మందికి సరఫరా చేసే మందు ఇపుడు రోజుకు 10 వేల మందికి ఇస్తున్నారు. ఇప్పటికే 70 వేలమందికి ఈ మందు ఇచ్చినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు.
 
అయితే, ఈ మందు తీసుకున్న ఏ ఒక్కరి కూడా తమకు అనారోగ్యం కలిగినట్టు ఫిర్యాదు చేయలేదు. పైగా, ఆక్సిజన్ లెవెల్స్ గణనీయంగా పడిపోయిన కరోనా పాజిటివ్ రోగులకు కూడా ఈ మందు ఎంతగానో పని చేస్తుంది. ఈ మందు వేసిన రెండు మూడు గంటల్లోనే వారు కోలుకుని సాధారణ స్థితికి వస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు