పరీక్షల రద్దుపై షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:04 IST)
ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయనీ, ఇపుడు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేస్తే ఎలా అంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. పైగా, చివరి నిమిషంలో పరీక్షల రద్దుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 
 
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రుల సంఘం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబరు 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్‌దారులను ప్రశ్నించింది. 
 
ముఖ్యంగా, చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖకు స్పష్టం చేసింది. 
 
మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించింది. 
 
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తల్లిదండ్రుల సంఘం పిటిషన్ ఉపసంహరించుకుంది. కాగా ఈనెల 25 నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 4.58 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు