భర్తపై పగబట్టిన భార్య... నమ్మించి ఉరిబిగించింది..

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (09:14 IST)
కన్నతండ్రిని హత్య చేసిన భర్తపై ఓ భార్య పగబట్టింది. అతనితో మంచిగా, చనువుగా ఉన్నట్టు నమ్మించి...  ఉరిబింగించి చంపేసింది. ఈ దారుణ తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం ఇర్విన్‌ పంచాయతీ పరిధి గాంగ్యనగర్‌తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గాంగ్యనగర్‌తండాకు చెందిన వడ్త్య శంకర్‌(28)కు చెట్లకుంటతండాకు చెందిన మమతతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చెట్లకుంటతండాలోనే ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. శంకర్‌కు మామ మేరావత్‌ లాలుతో తరచూ పొలం విషయంలో గొడవలు జరిగేవి.
 
ఈ క్రమంలో రెండున్నరేళ్ల కిందట ఇద్దరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి పని కోసం వెళ్లారు. అక్కడ గొడవ జరగడంతో రోలుతో మామపై శంకర్ దాడి చేసి చంపేశాడు. ఈ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. తండ్రిని చంపిన భర్తను ఎలాగైనా చంపాలని మమత పగ పెంచుకొంది. 
 
పది రోజుల క్రితం పుట్టింటి వారిని ఇంటికి పిలిపించుకుంది. శంకర్‌ నిద్రపోయాక బంధువులతో కలిసి గొంతుకు తాడు బిగించి చంపేసింది. మృతదేహాన్ని నల్గొండ జిల్లా నిడమనూరు వద్ద సాగర్‌ ఎడమ కాలువలో పడేశారు. ఈనెల 19న శంకర్‌కు అన్న రవీందర్‌నాయక్‌ ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. 
 
మరదల్ని ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పడంతో మాడ్గుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తమ్ముడి అత్తింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారిని విచారించి హత్యకు గురైనట్లు గుర్తించారు. హత్యకు పాల్పడిన మమత(23), శంకర్‌ అత్త సోని(50), తోడళ్లుళ్లు బాలాజీ(35), గోపి(31), వదినలు అనిత(27), సునీత(25)ను అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు