రూ.100 కోట్ల అవినీతి తిమింగలం : కీసర తాహసిల్దార్ లీలలెన్నో...

ఆదివారం, 16 ఆగస్టు 2020 (08:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి తిమింగలాన్ని ఆ రాష్ట్ర అవనీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. ఈ అవినీతి తిమింగలం బరువు (దోచుకున్న మొత్తం) ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైమాటగా ఉంది. ఓ భూ వివాద సెటిల్‌మెంట్‌కు రూ.కోటి పది లక్షలు లంచం తీసుకుంటా స్వయంగా ఏసీబీకీ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతని అవినీతిని వెలికితీయగా వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ అవినీతి తాహసిల్దార్ విధులు నిర్వహించేది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల కార్యాలయంలో. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ కీసర తాసిల్దార్‌ నాగరాజు పట్టుబడ్డారు. ఈయన అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెండోరోజు శనివారం కూడా తాసిల్దార్‌ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వందల కోట్ల విలువైన భూదస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయారాలో భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం రూ.2 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్టు తేల్చారు. ఇందులో కీలక వ్యక్తికి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డితో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం తాసిల్దార్‌ నాగరాజు శుక్రవారం రూ.కోటి 10 లక్షల తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
 
అలాగే, లంచం ఇస్తున్న ఉప్పల్‌లోని సత్య డెవలపర్స్‌కు చెందిన చౌవ్ల శ్రీనాథ్‌యాదవ్‌, రాంపల్లి దయారా గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌ను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. వీరిని శనివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చి రెండువారాల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు