భైంసాలో మళ్లీ ఘర్షణలు : కత్తులతో వీధుల్లో స్వైర విహారం...

సోమవారం, 8 మార్చి 2021 (07:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్‌ కాలనీలో చక్కర్లు కొట్టారు. దాంతో స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, పొలం పనులకు వెళ్లిన వారు నిద్రపోయే సమయమని, శబ్దం చేస్తూ తిరగవద్దని కోరారు. 
 
ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. క్షణాల్లో బట్టీగల్లీ, పంజేషా చౌక్‌, కోర్బగల్లీ, బస్టాండ్‌ ఏరియాతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. 
 
ఓ వర్గం యువకులు.. ప్రత్యర్థి వర్గం వారికి చెందిన రెండు ఆటోరిక్షాలు, ఒక కారు, మరో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. జనావాసాలపై రాళ్లు రువ్వారు. కత్తులతో కాలనీల్లో స్వైర విహారం చేశారు. గృహ దహనాలకు పాల్పడ్డారు. ఒక కూరగాయల దుకాణాన్ని తగులబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కత్తులతో దాడి చేశారు.
 
ఈ ఘటనలో దేవా, విజయ్‌ అనే విలేకరులతోపాటు.. ఆంధ్రజ్యోతి క్రైమ్‌ రిపోర్టర్‌ ప్రభాకర్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వీరిపరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 
 
ఘర్షణలో మరో నలుగురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి 10కల్లా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో.. భైంసాలో అదనపు బలగాలను మోహరించారు. 
 
ఆయా ప్రాంతాల్లోని అల్లరి మూకలను చెదరగోడుతూ పరిస్థితిని, మెరుగు పర్చేందుకు ప్రయత్నించారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు భైంసాకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు