వేలాది మంది భక్తుల నడుమ వైభవంగా భద్రాద్రి రామన్న కల్యాణం

గురువారం, 30 మార్చి 2023 (18:21 IST)
తెలంగాణలోని భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో గురువారం జరిగిన రామ నవమి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రామ నవమి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన భక్తులు సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు.
 
శ్రీరాముడు తన సతీమణి సీతతో కల్యాణం జరిపేందుకు ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో అలంకరించారు. చిన జీయర్ స్వామి సన్నిధిలో అర్చకులు సీతారామ కల్యాణానికి సంబంధించిన క్రతువులు నిర్వహించారు. మిథాలీ స్టేడియంలో జరిగిన వార్షిక కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు వీక్షించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లకు 'ముత్యాల తలంబ్రాలు' అందించారు.
అంతకుముందు ప్రధాన ఆలయంలో కొన్ని పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.
 
మండుతున్న ఎండల నుంచి భక్తులను రక్షించేందుకు దేవాదాయ శాఖ టెంట్లను ఏర్పాటు చేసింది. భక్తులు దివ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు స్టేడియం పరిసర ప్రాంతాలను 26 సెక్టార్లుగా విభజించారు.
 
భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఒక్కో సెక్టార్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. భక్తులకు తలంబ్రాలు అందించేందుకు దేవాదాయ శాఖ 70 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులకు పంపిణీ చేసేందుకు ఆలయ అధికారులు రెండు లక్షల 'ప్రసాదం' ప్యాకెట్లను సిద్ధం చేశారు.
 
ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా 2 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో కూడా రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు