తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఐకాస బుధవారం నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా, టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామునే ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఇవాళ నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో కోదండరామ్ను సికింద్రాబాద్లోని ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. పలువురు ఐకాస కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత మంగళవారం సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన ఐకాస ప్రతినిధులు, నేతలు ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను యధాతథంగా శాంతియుతంగా నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఈ ర్యాలీకి అన్ని జిల్లాలకు చెందిన పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.
అప్రమత్తమైన పోలీసులు నగరంలో మోహరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. పైగా, రోడ్లపై వాహనాలు తిరగకుండా ఇనుప ముళ్ల కంచెలు వేశారు.