గుర్తుపెట్టుకోండి.. మీ పేర్లన్నీ డైరీలో రాసిపెట్టుకుంటాం : రేవంత్ రెడ్డి

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:19 IST)
తెలంగాణ పోలీసులకు టీపీసీసీ రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోంది.. మీ పేర్లన్నీ డైరీలో రాసిపెట్టుకుంటాం అంటూ హెచ్చరించారు. పోలీసుల తీరు పక్షపాతమా? లేక పోలీసు శాఖకు సోకిన ‘గులాబీ’ పక్షవాతమా? అని ఆయన ప్రశ్నించారు. 
 
సీఎం కేసీఆర్ తెలంగాణను బీహార్ రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తన కార్యకర్తల కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రేవంత్.. మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ పంపిన టిఆర్ఎస్ గుండాలు నా ఇంటిపై, నా అనుచరులపై దాడి చేశారు. నా ఇంటిపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా.. నా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇది పక్షపాతమా? లేక పోలీసు శాఖకు సోకిన ‘గులాబీ’ పక్షవాతమా? 
 
మా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించకుండా.. అటూ ఇటూ తిప్పుతునట్టు సమాచారం ఉంది. మా కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తే ఊరుకునేది లేదు. మా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పోలీసుల కనుసన్నల్లోనే నిన్న మా ఇంటిపై దాడి జరిగింది. బీహార్‎కు చెందిన కొంతమంది పోలీస్ అధికారులను ఉన్నత స్థాయిలో నియమించి.. తెలంగాణను బీహార్ రాష్ట్రంగా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు. 
 
టీఆర్ఎస్‎కి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులు, అధికారుల వివరాలను మా డైరీలో రాసుకుంటాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అదనపు భద్రత కల్పించే విషయంలో మరోసారి కోర్టుకెళ్తాం. గతంలో నాకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గతంలో నన్ను ఫాలో అవుతున్న కొంతమందిని పట్టించినా కేసు నమోదు చేయలేదు. 
 
ఒక ఎంపీగా ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ రాయలేదు. మోడీ ప్రభుత్వం ఒక్క సంతకంతో బెంగాల్ బీజేపీకి చెందిన వంద మందికి భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించినపుడు.. నా భద్రత విషయంలో మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది’ అని రేవంత్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు