అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్.. త్వరలోనే ఐఎఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన త్వరలోనే ఐపీఎస్, ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నారు. ఈ స్థానభ్రంశాల్లో పలువురు సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ మేకు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమాచారం పంపించారు. ఆ సమాచారం ఆధారంగా ఐఎఎస్‌, ఐపీఎస్‌లను త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది.
 
ఇప్పటికే అడిషినల్‌ కలెక్టర్లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్‌ త్వరలోనే సీనియర్‌ ఐఎఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ చేయనున్నట్లు చర్చ నడుస్తోంది. కీలక పోస్టుల్లో ఉన్నవారి పనితీరుపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. 
 
ఎవరు, ఎక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు….?, వారి పనితీరు ఎలా ఉంది..?, ప్రభుత్వ పథకాలను అమలుచేయడంలో ఎలా పనిచేస్తున్నారు..? అనే పూర్తి సమాచారం సీఎంవోకు చేరడంతో వివిధ విభాగాల అధికారుల సమాచారం సీఎంకు అందించారు.
 
రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా సచివాలయంలో ఎక్కువకాలం ఒకే పోస్ట్‌లో కొనసాగుతున్న, ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నవారి వివరాలను సీఎం కేసీఆర్‌ తెప్పించుకున్నారు. ఒక్కో ఐఎఎస్‌ ఆఫీసర్‌ మూడు, నాలుగు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. 
 
అధికారులపై పని ఒత్తిడితో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావిస్తున్న ముఖ్యమంత్రి… ఒక అధికారికి ఒక శాఖ ఉండే విధంగా, తప్పనిసరి అయితే రెండు శాఖల బాధ్యతలు చూసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
 
అలాగే, పోలీస్‌ ఉన్నతాధికారుల్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న పోలీసు ఆఫీసర్లకు త్వరలో బదిలీలు తప్పేలా లేవు. ఓవరాల్‌గా చూస్తే తెలంగాణలో మూల విరాట్‌లుగా ఉన్న చాలామంది ఆఫీసర్లకు ఈ సారి స్థానభ్రంశం తప్పదు. ఈ బదిలీల్లో పనితీరు, ఆయా స్థానాల్లో చేసిన సర్వీస్‌ ప్రామాణికం కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు