తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ పొత్తు : హరీష్ రావు

శనివారం, 4 నవంబరు 2023 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన ఢిల్లీలో వెలువడగానే భోజనం చేయడం మానేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భారతీయ జనతా పార్టీ చేతులు కలిపిందని భారత రాష్ట్ర సమితి నేత, మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టు కట్టాయన్నారు. పవన్, షర్మిల... ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశానని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందన్నారు.
 
అలాగే, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ వైపు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వమని కొట్లాడితే ఇవ్వడానికి అది సిగరెట్టా..? బీడియా...? అని వైఎస్ ఆనాడు అన్నాడని గుర్తు చేశారు. పైగా, తాను జీవించి ఉండగా, తెలంగాణ రాదన్నారని తెలిపారు. 
 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని తెలిసిందని, ఓట్లు చీలవద్దనే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదంట అని అన్నారు. మనకు స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా, రాంగ్ లీడర్లు అవసరమా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు