నీ యిష్టంతో నాకు పని లేదు.. నన్నే పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కిడ్నాప్ చేశాడు.. వైశాలి

ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:59 IST)
నీ ఇష్టంతో నాకు పనిలేదు.. నువ్వంటే నాకు ఇష్టం.. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని బెదిరించిన నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేశాడని దంత వైద్య విద్యార్థిని వైశాలి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
 
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో పలు ఆసక్తికర విషయాలు పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి, బాధితురాలి వైశాలికి వివాహం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైశాలి స్పందించారు. 
 
అతడితో తన పెళ్లి జరగలేదని స్పష్టం చేసింది. పైగా, అతడు పెళ్లి జరిగింది అని చెప్పిన రోజున తాను ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని వైశాలి వెల్లడించింది.
 
అతడితో తనకు బ్యాడ్మింటన్ ఆడే సమయంలో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తనకు ఇష్టంలేదని చెప్పి దూరం పెట్టానని తెలిపారు. కానీ, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బుచ్చిరెడ్డి ద్వారా తన తల్లిదండ్రులను సంప్రదించి పెళ్లి ప్రస్తావన చేయగా, తన తల్లిదండ్రులు కూడా అతడిని ఇష్టపడలేదని వైశాలి చెప్పింది.
 
ఆ తర్వాత తనను బెదిరించడం, వేధించడం మొదలు పెట్టాడని, పెళ్లి చేసుకోకపోతే తన జీవితం నాశనం చేస్తాని చెప్పి, ఇంటిపై దాడిచేసి బలవంతంగా లాక్కెళ్లాడని, కారులోనే తనను తీవ్రంగా కొట్టాడని బోరున విలపిస్తూ చెప్పింది. తాను చెప్పినట్టు వినకపోతే తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని వైశాలి ఆరోపించారు. నీ యిష్టంతో నాకు పని లేదు.. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవాడనికి వీల్లేదు అని బెదిరించాడని వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు