అప్పటి వరకు తనకు తిరుగులేదని అనుకున్న చంద్రబాబు నాయుడికి, అప్పట్లో జరిగిన క్యాబినెట్ విస్తరణ తర్వాత గడ్డు రోజులు మొదలయ్యాయని ఆమె గుర్తుచేశారు. తనకు మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయడం... చివరకు అది టిడిపి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరని చెప్పుకొచ్చారు.
తన మాటే శాసనం అనుకున్న కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదని చెప్పారు. అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బెదిరించి... వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ కెసిఆర్ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు కానీ.. రోజురోజుకు పెరిగే అసంతృప్తిని అడ్డుకోవడం ఆయన తరం కాదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్లో వినిపిస్తున్న నిరసన గళాన్ని చూస్తూ ఉంటే..గతంలో మాదిరిగా కెసిఆర్ పేరు చెబితే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టిఆర్ఎస్లో అసమ్మతి వర్గం పెరుగుతోందంటే.. దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కెసిఆర్ గారికి ఈపాటికే అర్ధం అయి ఉంటుందని విజయశాంతి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్, టీడీపీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్కు ఇప్పుడు అదే అనుభవం బిజెపి రూపంలో పునరావృతం అవుతుందన్న వాదన వినిపిస్తోందని.. రోజువారి పరిణామాలు కూడా ఈ వాదాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయని విజయశాంతి అభిప్రాయపడ్డారు.