భార్యపై అనుమానం.. కుమార్తె కళ్లముందే.. భార్యను కత్తితో పొడిచి చంపేశారు..

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:03 IST)
వరంగల్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను కన్నబిడ్డ ముందే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం వ‌రంగ‌ల్ జిల్లా చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయ్యారం గ్రామానికి చెందిన సరిత (30)కు కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన కొండ బత్తులు నరేశ్‌తో 14 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. కొన్ని సంవత్సరాలు వారి సంసారం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టాక్సీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న నరేశ్‌ కొన్ని సంవత్సరాలుగా భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. 
 
తాను లేని సమయంలో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సరితను తీవ్రంగా కొట్టడంతో తలకు, చెయ్యి విరిగింది. దీంతో ఆమె తన తల్లి గారింటికి వెళ్లింది. సోమవారం అత్తగారి గ్రామమైన జయ్యారం ద్విచక్రవాహనంపై వెళ్లాడు. 
 
మహబుబాబాద్‌ దవాఖానలో వైద్యం చేయిస్తానని తనతో రావాలని చెప్పడంతో చిన్న కూతురు మేఘనను తీసుకుని ఇద్దరు దవాఖానకు వెళ్లారు. వైద్యం చేయించిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇల్లందు, మహబుబాబాద్‌ ప్రధాన రహదారిలో ఉన్న నామాలపాడు అడవి వద్ద వాహనాన్ని నిలిపాడు. 
 
నీతో కొంచెం మాట్లాడాలి రోడ్డుపై ఎందుకు అడవిలోకి పోదాం అని అన్నాడు. అతడి మాటలు నమ్మిన సరిత అతడితో అడవిలోకి వెళ్లింది. కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి పొడిచి చంపాడు. అక్కడే ఉన్న కూతురు మేఘన అమ్మ కావాలి అని ఏడుస్తున్నా కనికరం లేకుండా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు