మనస్పర్థలెందుకు? మాట్లాడుకుందాం రా... రెండో భార్యను హత్య చేసిన మొదటి భార్య

శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:07 IST)
మన ఇద్దరి మధ్య భర్త కోసం మనస్పర్థలు ఎందుకు... మాట్లాడుకుందా రా అంటూ పిలిచి రెండో భార్యను చున్నీ బిగించి హత్య చేసింది మొదటి భార్య. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది.
 
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. రాయదుర్గంలోని పోచమ్మ బస్తీకి చెందిన భాస్కర్ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి తొమ్మిదేళ్ల కిందట జానకి అనే మహిళతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే లాక్ డౌన్ ప్రారంభంలో మరో యువతితో పరిచయం పెంచుకున్నాడు.
 
అంతేకాదు.. మొదటి భార్యకు చెప్పకుండా ఆమెను పెళ్లాడాడు. ఆ తర్వాత రెండో భార్య స్రవంతి గర్భం దాల్చింది. భర్త ఇంటికి ఆలస్యంగా వస్తుండటాన్ని గమనించిన జానకి అసలు విషయాన్ని కనిపెట్టింది. దీనితో భర్తతో గొడవకు దిగింది. రెండో భార్య స్రవంతికి ఫోన్ చేసి వాదన చేసింది. ఐతే ఆమె గర్భవతి అని తెలియడంతో ఇక ఎలాగైనా స్రవంతిని అంతం చేయాలని పథకం వేసింది. సోదరుడితో విషయాన్ని చెప్పింది.
 
ఈ క్రమంలో నిన్న ఉదయం స్రవంతికి ఫోన్ చేసి.. మనమధ్య గొడవలెందుకు? పరిష్కరించుకుందాం, త్వరగా వచ్చేయమంటూ పిలిచింది. జానకి మాటలను నమ్మిన స్రవంతి నేరుగా జానకి ఇంటికి వెళ్లింది. ఐతే అప్పటికే భర్తకు కాస్త నిద్రమాత్రలు ఇవ్వడంతో అతడు మత్తులోకి వెళ్లిపోయాడు. స్రవంతి రాగానే మాట్లాడుతూనే ఆమె వేసుకున్న చున్నీతోనే మెడను గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. సోదరుడి సాయంతో ఈ ఘాతుకానికి పాల్పడింది.
 
ఆ తర్వాత శవాన్ని పక్క గదిలో దాచేసింది. మత్తు నిద్ర నుంచి లేచిన భర్త స్నేహితుడి వద్దకు వెళ్లాడు. ఐతే స్రవంతి ఆచూకి లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్రవంతి భర్తకి ఫోన్ చేసారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసారు. ఎలాగైనా నిజం బయటపడుతుందని, జానకి సోదరుడు స్రవంతిని హత్య చేసింది తామేనని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా స్రవంతి ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు