ఇప్పటికే చాలా ఛానల్స్ వచ్చాయి. న్యూస్, ఎంటర్టైన్మెంట్, భక్తి తదితర అంశాలతో వేటికవి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఛానెల్స్ గ్రామాల్లోని ప్రతిభను బయటకు తేవాలని, అవి అందరికీ స్ఫూర్తినిచ్చేవిధంగా ఉండాలని సీఎం సూచించారు.
రొటీన్లా కాకుండా ఓ ప్రత్యేకతను నిరూపించుకునేలా ఛానెల్స్ ఉండాలని, లోకల్ టీవీ దినదినాభివృద్ధి చెందాలని వైఎస్సార్ అన్నారు. లోకల్ టీవీ (నాఊరు, నాటీవీ) క్యాప్షన్తో ఏర్పాటు చేసిన టీవీ ఛానెల్ను వైఎస్సార్ హైదరాబాద్లో ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా లోకల్ టీవీ ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... పల్లెపల్లెలో వినోదకార్యక్రమాలు, విశేషాలు కళ్లముందుంచాలని చేసే ప్రయత్నమే లోకల్ టీవీ ఆవిర్భావమని, ప్రగతి పథంవైపు నడిపించేలా ఈ టీవీ కార్యక్రమాలుంటాయని చెప్పారు.
ఏషియా నెట్ తెలుగు ఛానెల్ "సితార" నేటి నుంచి (గురువారం) నుంచి ప్రారంభం కానుందని సి.ఇ.ఓ విజయ్ బాబు వెల్లడించారు. త్వరలో న్యూస్ ఛానెల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ హెచ్.పి.ఓ. కవితా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరక్టర్ స్వప్నాదత్, విష్ణువర్ఘన్ ఇంటూరి (సి.ఇ.ఓ) జయప్రద తదితరులు హాజరయ్యారు.