వినూత్నంగా "వినాయకుడు" ఆడియో

WD
కృష్ణుడు, సోనియా జంటగా నటిస్తోన్న "వినాయకుడు" ఆడియో వేడుక వినాయకచవితి రాత్రి శిల్పకళామందిరంలో వినూత్నంగా జరిగింది. చిత్ర నిర్మాత ప్రేమ్ కుమార్ తనయుడు ప్రధాన్ గణేశుని వేషధారణతో వేదికపైకి వచ్చి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. ముఖ్య అతిథి సంగీత దర్శకుడు కీరవాణి క్యాసెట్‌ను విడుదల చేయగా, బిల్డర్ కృష్ణప్రసాద్ కేసెట్ కొనుగోలు చేశారు. సీడీని బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ విడుదల చేయగా నటుడు వరుణ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి తనను, భాస్కర్‌ను పిలిపించినందుకు ఆనందంగా ఉందని, శ్యామ్ ప్రసన్న చక్కటి సంగీతాన్ని సమకూర్చారని, అన్ని పాటలు సందర్భాను సారంగా సాగినవేనని చెప్పారు. హీరో కృష్ణుడు చక్కగా నటించాడని, హ్యాపీడేస్‌లా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

భాస్కర్ మాట్లాడుతూ... ఆడియో విడుదలే వెరైటీగా ఉందని, చిత్ర దర్శకుడు సాయికిరణ్ కొన్ని యాడ్ ఫిలిమ్స్ చేశాడని, చిత్రం విజువల్స్ చూశాక మంచి బేనర్ ద్వారా అతను పరిచయం అవుతున్నాడనిపించిందని చెప్పారు.

సంగీత దర్శకుడు శ్యామ్ ప్రసన్న మాట్లాడుతూ.. పెద్దల సమక్షంలో వినాయకచవితి రోజు ఆడియో విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇందులో ఉన్న నాలుగు పాటలు అందరినీ ఆకట్టుకుంటాయనే నమ్మకముందని తెలిపారు.

చిత్ర నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అయినా ఒక్కశాతం సెంటిమెంట్ ఉందన్నారు. హీరో పాత్ర కంటతడిపెట్టిస్తుందని, కొత్తవాడైనా సాయికిరణ్ చక్కగా దర్శకత్వం వహించారని చెప్పారు. త్వరలో సినిమాను విడుదల చేయనున్నామని వెల్లడించారు.

గీత రచయిత అవినాష్ ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి పూనమ్ కౌర్, వరుణ్ సందేశ్‌లు కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి