పిక్చర్ హౌస్ మీడియా దాఖలు చేసిన కేసుపై సివిల్ కోర్టులో నటి శ్రుతి హాసన్కు ఊరట లభించింది. శ్రుతి హాసన్పై పిక్చర్ హౌస్ మీడియా వేసిన పిటిషన్ను సివిల్ కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 17వ తేది జరిగిన ఈ కేసు విచారణలో కేవలం తన క్లైంట్ను వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా ఆమెపై కేసు దాఖలు చేసిందని నటి శ్రుతి హాసన్ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్థానంలో తమన్నా భాటియాను ఎంపిక చేశారని, షూటింగ్ కూడా జరుపుకుంటోందని ఆమె తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా నాగార్జున, తమిళ హీరో కార్తీ, శృతిహాసన్ కథానాయికగా తమిళ, తెలుగుభాషల్లో పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ ఓ సినిమా నిర్మించేందుకు సిద్దమైంది. ఈ మేరకు గత డిసెంబర్ 10న శృతి హాసన్ కాల్షీట్లను ఇచ్చారు. ఒప్పందం కుదిరిన తరువాత ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. రెండవ షెడ్యూల్ తేదీలు ఇవ్వాలని కోరుతూ సంస్థ ప్రతినిధులు శృతిహాసన్ను సంప్రదిస్తే తేదీలు ఖాళీ లేవని సమాధానం వచ్చింది.
షూటింగ్ జరగకపోతే ఐదు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపినా శృతి హాసన్ పట్టించుకోలేదు. కనీసం ఫోన్లో కూడా స్పందించకపోవటంతో మూడవ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సిటీ సివిల్ కోర్టు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు శ్రుతీ హాసన్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.