హిట్ కోసం సెంటిమెంట్‌ని న‌మ్ముకున్న బాల‌య్య‌

మంగళవారం, 7 మే 2019 (12:05 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా అప్‌సెట్ అయ్యాడ‌ట‌. ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌ెస్ సాధించాల‌ని ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడ‌ట‌. మ్యాట‌ర్ ఏంటంటే... ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో బాల‌కృష్ణ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ సినిమాతో తొలిసారి జతకట్టిన వీరిద్దరూ మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్యకు విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నట్లు పేర్కొంది. బ్లాక్‌ బ‌స్టర్ ‘లెజెండ్‌’ త‌ర్వాత బాల‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు మరోసారి తలపడుతున్నారు. జ‌గ‌ప‌తిని విల‌న్‌గా ఎంచుకోవ‌డానికి కార‌ణం లెజెండ్ స‌క్స‌స్ అవ్వ‌డ‌మే అంటున్నారు.
 
 ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. సంక్రాంతికి బాల‌య్య‌ వ‌స్తే.. హిట్టే. ఈ భారీ చిత్రం మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వర‌లో ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. హిట్ కోసం సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. మ‌రి.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి బాల‌య్య‌కి విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు