మెహ్రీన్‌ను వేధించిన నిర్మాత... రాకపోతే బిల్లు చెల్లించనని వార్నింగ్

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (19:00 IST)
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మెహ్రీన్. ఈమె నటించిన తాజా చిత్రం అశ్వత్థామ. నాగశౌర్య హీరోగా కాగా, ఆయన తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించగా, తల్లి ఉష నిర్మాతగా ఉన్నారు. అయితే, ఈ చిత్రం ఇటీవల విడుదలకాగా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేక పోయింది. ఈ విషయాన్ని పక్కనబెడితే... ఈ చిత్ర సమర్పకుడుగా ఉన్న హీరో తండ్రి శంకర్ ప్రసాద్ హీరోయిన్‌ మెహ్రీన్‌ను ముప్పతిప్పలు పెట్టినట్టు ఓ వార్తల చక్కర్లు కొడుతోంది. 
 
అదేంటంటే 'అశ్వ‌త్థామ' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మెహ్రీన్ హాజరుకావాల్సివుంది. కానీ, అనారోగ్యం కారణంగా ప్రమోషనల్ కార్యక్రమాలకు రాలేనని నిర్మాతకు చెప్పింది. కానీ, శంకర్ ప్రసాద్ ఏమాత్రం వినిపించుకోలేదు. పైగా, ఈ కార్యక్రమానికి రావాల్సిందేనంటూ మంకుపట్టుపట్టారు. అప్పటికీ రాకపోతే.. హోటల్ బిల్లులు చెల్లించనని తేల్చి చెప్పారు. 
 
దీంతో ఖంగుతిన్న మెహ్రీన్.. శంకర్ ప్రసాద్‌కు చెప్పాపెట్టకుండా హోటల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయిందట. దాంతో హోట‌ల్ యాజ‌మాన్యం శంక‌ర్ ప్ర‌సాద్‌కు ఫోన్ చేసి అస‌లు విష‌యం చెప్ప‌డంతో శంక‌ర్ ప్ర‌సాద్ ఆమె బిల్లులు చెల్లించకతప్పలేదు. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై స‌ద‌రు నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు