భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఏడుకొండలవాడు అనే పేరును నామకరణం చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో అన్నమయ్య. శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి చిత్రాల్లో నటించిన నాగార్జున మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెల్సిందే.
వీరి కలయికలో 'శిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్మార్ సాయికృప ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత మహేష్ రెడ్డి ఇప్పుడీ భారీ ప్రాజక్టును చేబడుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్టు చెబుతున్నారు. అన్నమయ్యగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న నాగార్జున, ఏడుకొండల వాడిగా ఎలా ఆకట్టుకుంటాడన్నది ఆసక్తికరం!