'ఉయ్యాలవాడ'లో రెండో హీరోయిన్‌ పేరు ఖరారు... రెమ్యునరేషన్‌గా రూ.4 కోట్లు?

సోమవారం, 17 జులై 2017 (09:12 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి". ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు.. మరో కీలక పాత్ర ధారిణి ఉండనున్నారు. ఒక కథానాయికగా ఐశ్వర్య రాయ్‍ను, మరో హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఇందుకోసం నయనతార భారీగానే డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించే నయనతారకు 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్ర నిర్మాత అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సాధారణంగా ఒక భాషలో చేసే సినిమాకే నయనతార రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ తీసుకుంటుంది. 
 
ఈ సినిమా నాలుగు భాషలకి సంబంధించినది కావడంతో ఆమె రూ.4 కోట్లు డిమాండ్ చేయగా, అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన షూటింగ్ లాంఛనంగా ప్రారంభంకానుంది.

వెబ్దునియా పై చదవండి