నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ''ఇజం''. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులో బుధవారం ఘనంగా జరిగింది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతంతో పాటు… పూరీ జగన్నాథ్ ఓ పాట రాయడంతో పాటు స్వయంగా పాడడం ఇజమ్ సినిమాకు హైలెట్గా మారింది. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో ''ఇజం'' తెరకెక్కిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు కళ్యాణ్ రామ్ కూడా ఇంతకు ముందెన్నడూ కనిపించనంత సరికొత్త లుక్లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.
ఆడియో లాంచ్లో పూరీ మేకింగ్ స్టైల్పై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. పూరి నోట బూతు కూడా అందంగా ఉంటుందని, అదో ఎక్స్ప్రెషన్లా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. బూతు బూతులా కాకుండా.. అది ఒక భాషలా అనిపించేలా చేయడం పూరీకి తెలిసినంతగా మరొకరికి తెలియదని అన్నాడు. 'తెలుగు సినిమా మాస్కి ఒక క్లాస్ టచ్ ఇస్తాడు' అని పూరీని ఆకాశానికెత్తేశాడు ప్రకాష్ రాజ్.
పూరి జగన్నాథ్నేకాక 'ఇజం'కు సంగీతాన్నందించిన అనూప్ రూబెన్స్నూ పొగిడేశాడు ప్రకాష్ రాజ్. 'మళ్లీ రాజా(ఇళయరాజా)గారిని గుర్తు చేశావ్' అంటూ అతడిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇక, హీరో కల్యాణ్ రామ్నూ ప్రశంసలతో ముంచెత్తాడు ప్రకాష్ రాజ్. ఈ సినిమాను ఈనెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.