'వకీల్ సాబ్‌'కు హీరోయిన్ కష్టాలు - ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్!

శనివారం, 20 జూన్ 2020 (14:37 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ చిత్రానికి హీరోయిన్ కష్టాలు తప్పలేదు. చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది పేర్లు వినిపించాయి. చివరకు శృతిహాసన్‌ పేరును ఖరారు చేశారు. అయితే, ఆమె కూడా ఇపుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి పవన్ సరసన నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే, ఆ సినిమా తమ కెరీర్‌కి అంతో ఇంతో సహాయపడుతుందని భావిస్తారు. అందులోనూ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వస్తున్న హీరోయిన్ కైతే మరీనూ. అందుకే ఎవరైనా సరే వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే, శ్రుతి హాసన్ మాత్రం తాజాగా పవన్ కల్యాణ్ చిత్రాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది.
 
కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వచ్చిన శ్రుతి ఈ ఆఫర్‌‌ని మొదట్లో ఒప్పుకుని, ఇప్పుడు చేయనని చెప్పినట్టు సమాచారం. కారణం ఏమిటంటే, ఈ సినిమాలో కథానాయిక పాత్ర నిడివి చిన్నదట.. పైగా ఏమాత్రం ప్రాధాన్యత లేదట. ఇలాటి పాత్ర చేయడం వల్ల తన కెరీర్‌కి ఏమాత్రం ప్రయోజనం ఉండదని అమ్మడు ఆలోచించుకుని, ఇప్పుడు నో చెప్పిందట! అయితే, దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు