ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. దీంతో ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ, సోషల్ మీడియాలో ఓ పోస్టర్ దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదంతా నిజం కాదండోయ్... అంతా ఉత్తుత్తిదే అంటూ ఓ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ను విద్యాబాలన్ ట్విట్టర్ ఖాతాలో చాలా వెరైటీగా పోస్ట్ చేసింది.
అయితే ఈ ఫోటోకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విద్యా బాలన్ నటిస్తున్న 'కహానీ-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో విద్యా దుర్గా రాణీ సింగ్ పాత్రను పోషిస్తోంది. విద్యాబాలన్ గతంలో ప్రధానపాత్ర పోషించి నటించిన కహానీ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని చిత్రం బాలీవుడ్లో సంచలన విజయం సాధించి కాసుల వర్షాన్నికురిపించింది.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్గా 'కహానీ-2' తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇలా వెరైటీగా పోస్ట్ చేశారు. విద్యాబాలన్, అర్జున్ రాంపాల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. ఇక రిలీజ్ డేట్ విషయంలో పక్కా ప్లానింగ్తో వ్యవహరించే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్... ఈ సినిమా రిలీజ్ డేట్ను అప్పుడే అనౌన్స్ చేశారు. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్... సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ను ఖరారు చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది.