విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్: ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ కోసం జిమ్‌లో కసరత్తులు?

శనివారం, 13 మే 2017 (17:28 IST)
లేడీ బాస్, లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి తిరిగి సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన కథానాయికగా అదరగొట్టిన విజయశాంతి.. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో తనకు తానే సాటి అన్నట్లు దూసుకెళ్లింది. ఓ క్రమంలో హీరోలతో పోటీపడిన విజయశాంతిని.. అప్పట్లో కావాలనే కక్షతోనే కొన్ని కేసుల్లో ఇరికించినట్లు వార్తలొచ్చాయి. 
 
అయితే ఈ కేసులకు ఏమాత్రం జడుసుకోని విజయశాంతి చాలాకాలం పాటు సినిమాల్లో కొనసాగారు. ఆపై సినిమాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీ అయ్యారు. సొంత పార్టీ పెట్టారు. తెరాసలో కీలకం వ్యవహరించారు. అయితే ఉన్నట్టుండి విజయశాంతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో రాజకీయాలకు దూరమైన విజయశాంతి ప్రజలకు కూడా దూరమయ్యారు.
 
ఈ గ్యాప్‌ ఫుల్ ఫిల్ చేసుకోవడానికి మళ్లీ విజయశాంతి నటనవైపు దృష్టి పెట్టనున్నారని సమాచారం. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకే మళ్లీ విజయశాంతి సినిమా చేయాలనుకుంటున్నారట. అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకోవడం, రాజకీయాల్లో ఉండటం ద్వారా కొంత కాలం సినిమాకు దూరమైన ఈమె త్వరలో వెండితెరపై కనిపించనున్నారని వార్త రావడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా టైమ్‌లోనే విజయశాంతి సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి రిలీజ్‌కు తర్వాత సినీ సెకండ్ ఇన్నింగ్స్‌పై విజయశాంతి దృష్టి పెట్టారు. నటన కోసం తగిన ఫిజిక్ కోసం విజయశాంతి జిమ్‌లో కసరత్తులు కూడా మొదలుపెట్టారని సమాచారం.
 
ఇకపోతే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన "ఓసేయ్ రాములమ్మ'' 1997లో విడుదలై అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా విజయశాంతి గెలుచుకుంది. ఈ సినిమా సీక్వెల్‌లోనే విజయశాంతి నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి