దేశంలో ఉందని చెప్తున్న పరమత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్లో తీవ్రస్థాయి చర్చనే లేవనెత్తాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనలతో దేశం విడిచి వెళ్లిపోదామా? అని ఓ దశలో తన భార్య కిరణ్ రావు అడిగిందని అమీర్ ఖాన్ చెప్పడం పెద్ద దుమారమే రేపింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అమీర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విట్టర్లో స్పందించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులకు అమీర్ చేసిన వివాదం చల్లబడింది, కానీ ఆయనకున్న ఇమేజ్ మాత్రం చాలా డ్యామేజ్ అయ్యింది.
దీంతో స్నాప్ డీల్ ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా తొలగించింది. అలాగే ''అతిధి దేవో భవా'' అంబాసిడర్ నుండి కూడా ఆయన తప్పుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ థమ్స్అప్ .. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా తప్పించింది. సల్మాన్ నాలుగేళ్లుగా థమ్స్అప్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కాంట్రాక్టు ఇటీవల ముగిసింది.
అయితే ఆయనతో మళ్ళీ కాంట్రాక్ట్ కొనసాగించడానికి థమ్స్అప్ నిరాకరించింది. ఆయన స్థానంలో రణ్వీర్ సింగ్ను తీసుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఎందుకంటే...ఇటివల ఉరీ దాడి, అంతకు ముందు యాకుబ్ మీనన్ .. సంఘటనలపై సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇమేజ్కు దెబ్బపడినట్లు సమీక్షించిన సదరు సంస్థ ఇక సల్మాన్కు గుడ్ బై చెప్పేసిందని వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఏ సంస్థలైన సదరు సెలబ్రిటీల ఇమేజ్ను కోరుకుంటుందే కాని వివాదాల్ని కోరుకోదు.