సుమన్ చేసిన పని తలుచుకుంటే గుండె పొంగుతుంది, ఏం చేసారు?

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (16:26 IST)
హీరో సుమన్ రియల్ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 175 ఎకరాల భూమిని జవాన్లకు డొనేట్ చేసి అప్పట్లో తన మంచి మనసు చాటుకున్నారు సుమన్. ఆ భూమిపై కేసు నడుస్తున్న సందర్భంలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు హీరో సుమన్. అంతేకాదు పూర్తి స్థాయిలో యాక్షన్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు సుమన్.
 
నేను సంపాదించిన ఆస్తిలో 175 ఎకరాలు సైనికుల కోసం ఇవ్వడం త్యాగం అని నేను అనుకోను, అది నా బాధ్యతగా భావించా. అందుకే దేశాన్ని రక్షించే సైనికులకు 175 ఎకరాలను ఇచ్చేశా. కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు సాయం చేయాలని అన్నప్పుడు అందరూ స్పందించి లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షలు ఇలా ఎవరికి తోచింది వాళ్లు డొనేట్ చేశారు. 
 
అలాంటి సందర్భంలో మీడియా వాళ్లు మీరు ఏం డొనేట్ చేస్తారని అడిగినప్పుడు నేను మా ఇంటికి ఫోన్ చేసి అడిగా.. నా భార్య ఈ భూమిని డొనేట్ చేద్దాం అని చెప్పింది. సైనికుల వెల్ఫేర్‌కి ఆ భూమిని ఉపయోగిస్తాం అన్నారు. అయితే ఆ భూమిపై కేసు నడుస్తోంది. అయితే అందులో ఎంత భూమి వచ్చినా దాన్ని సైనికులకే ఇచ్చేస్తాం.
 
నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే.. దేశ సరిహద్దుల్లో జవానులు అన్నింటికీ ఓర్చుకుని మనల్ని రక్షిస్తున్నారు. వాళ్లలా మనం ఒక్కరోజు కూడా పనిచేయలేం. ఫ్యామిలీస్‌కి దూరంగా మనకోసం బోర్డర్‌లో అన్నీ త్యాగం చేస్తున్నారు. వాళ్లను చూసినప్పుడు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే నా భార్యతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. 
 
నిజానికి ఆ డొనేట్ చేసిన స్థలాన్ని ఔట్‌డోర్ స్టుడియోగా చేద్దాం అనుకున్నాం. కాని నా భార్య సైనికులకు ఇచ్చేద్దాం అన్నారు. మేం ఇలా ఒక అడుగు ముందుకు వేస్తే.. మరికొంత మంది ముందుకు వస్తారనే ఆలోచనతో ఆ పనిచేశాం. మరికొన్నిరోజుల్లో ఈ స్థలం క్లియర్ అవుతుంది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని పత్రాలను సబ్‌మిట్ చేస్తా అంటూ చెప్పుకొచ్చారు హీరో సుమన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు