ఆర్ఆర్ఆర్... 14న అన్నింటికీ బ్రేక్ వేస్తానంటున్న రాజమౌళి

మంగళవారం, 12 మార్చి 2019 (14:24 IST)
'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి సినిమా అంటే భారతీయ సినిమా అనే ముద్ర పడింది. టాలీవుడ్ దర్శకుడు అనే స్థాయి నుండి జాతీయ స్థాయి దర్శకుడు అనే స్థాయికి రాజమౌళి ఎదిగాడు. ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" చిత్రీకరణలో బిజీగా ఉన్న రాజమౌళి త్వరలో ఆ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం.
 
సినిమా కథ గురించిన పుకార్లు, ఫలానా నేపథ్యంలో సినిమా ఉండబోతుందని, ఫలానా హీరోయిన్లు సినిమాకు ఎంపికయ్యారని, సినిమాకు విదేశాల్లో భారీ బిజినెస్ జరిగిందని ఇలా అనేక వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు రాజమౌళి కానీ, చిత్ర యూనిట్ సభ్యులు కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులు అయితే తమ హీరో పాత్ర మరో హీరో కంటే అద్భుతంగా ఉండబోతోందని రకరకాల పుకార్లతో ట్రోల్ చేసేస్తున్నారు.
 
ఇలాంటి వార్తలు, ట్రోల్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ నెల 14న రాజమౌళి సినిమా వివరాలను వెల్లడించేందుకు ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ప్రెస్‌మీట్‌లో ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలన్నింటికీ సమాధానాలు చెప్పబోతున్నారట. ఈ ప్రెస్‌మీట్‌తో అయినా ఇద్దరు హీరోల అభిమానులు ఊహల్లోంచి వాస్తవాలకు వస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు