థియేటర్లు తగులబెడతారు .. రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్!

మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:53 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు నటిస్తున్నారు. ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుంటే, అల్లూరు సీతారామరాజు పాత్రను చెర్రీ పోషిస్తున్నారు. 
 
అయితే, ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను ఆ సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముస్లిం వేషధారణలో ఎన్టీఆర్ కనపడిన లుక్‌పై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ధరించిన టకియాను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే ఈ సినిమా ఆడే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని సోయం బాపూరావు హెచ్చరికలు చేశారు. 
 
ఈ సినిమా వసూళ్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఊరుకోబోమన్నారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన భీమ్‌ను చంపిన వాళ్ల టోపీని ఆ పాత్ర పోషిస్తున్న వ్యక్తికి పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని మండిపడ్డారు. దర్శకుడు రాజమౌళి చరిత్రను తెలుసుకోవాలని ఆయన సూచించారు. భీమ్ పాత్రలో కనపడిన ఎన్టీఆర్ టకియాను ధరించడం పట్ల పలు ఆదివాసీ సంఘాలు కూడా మండిపడ్డ విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు