కరోనా కోలుకున్న బాలీవుడ్ నటి.. ఆపై పక్షవాతం...

ఆదివారం, 13 డిశెంబరు 2020 (18:03 IST)
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో బాలీవుడ్ యువ నటచి శిఖా మల్హోత్రా ఒకరు. ఈమె కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నానన్న ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ.. అంతలోనే పక్షవాతానికి గురైంది. 
 
నటి శిఖా మల్హోత్రా కరోనా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ.. ఆ తర్వాత పక్షవాతంతో బాధపడుతుందని, ఆమె కుడివైపు భాగం అచేతనంగా మారిందని ఆమె మేనేజర్ అశ్వని శుక్లా తెలిపారు. సరిగా మాట్లాడలేకపోతున్నారని వివరించారు. 
 
ఈమె కరోనా లాక్డౌన్ సమయంలో ఆమె సామాజిక స్ఫూర్తిని చాటుతూ ఓ నర్సుగా మారి కరోనా రోగులకు సేవలందించారు. శిఖా సినిమాల్లోకి రాకముందు నర్సింగ్ విద్య అభ్యసించారు. తన విద్యకు సార్థకత చేకూర్చుతూ లాక్డౌన్ సమయంలో స్వచ్ఛంద సేవలందించారు. 
 
ఈ క్రమంలో ఆమె కూడా గత అక్టోబరులో కరోనా బారినపడ్డారు.  కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా పక్షవాతానికి గురికావడంతో శిఖాను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కాగా, ఈమె గతంలో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఫ్యాన్' చిత్రం ద్వారా మంచి గుర్తింపుపొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు