చంద్రబాబును కలవాలనుకున్నా : రజినీకాంత్

ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (22:19 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తాను కలవాలనుకున్నానని, కానీ కుటుంబ ఫంక్షన్ కారణంగా వెళ్లలేక పోయినట్టు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. 
 
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుతో రజినీకాంత్ ములాఖత్ అవుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ వార్తలపై రజినీకాంత్ స్పందించారు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లలేకపోయానని తెలిపారు. 
 
కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్ సమాధానమిచ్చారు.
 
చంద్రబాబు, రజినీకాంత్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు రజినీకాంత్ కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు.
 
'చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయన్ని బయటకు తీసుకొస్తాయి' అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు