ఇలాంటి వ్యక్తినా నేను దూషించింది అని పశ్చాత్తపడ్డాను : చిన్నికృష్ణ

వరుణ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (15:15 IST)
మెగాస్టార్ చిరంజీవికి సినీ కథారచయిత చిన్నికృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవిని దుర్భాషలాడినట్టు చెప్పారు. అందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నట్టు చెప్పారు. తాజాగా చిన్నికృష్ణ మాట్లాడుతూ, "చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించా. వాళ్ల ఇంటికెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. నేనూ చేశాను. నాపై నమ్మకంతో "ఇంద్ర"లో నాకు అవకాశమిచ్చారు. అయితే.. గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడాను. దీంతో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఆ క్షణం నుంచి ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో బాధపడ్డాను. తాజాగా చిరంజీవిని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నా వృత్తిగత జీవితం ఎలా ఉందని అడిగారు. ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపపడి క్షమించమని అడిగాను."
 
"ఏమైనా కథలు ఉంటే కలిసి పనిచేద్దాం" అని చిరంజీవి అన్నారు. ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది అన్నయ్య. అంత గొప్ప కథ రాస్తాను. మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తమ్ముడిగా పుట్టాలని కోరుకుంటా" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు