మమతను ప్రధాని మోడీ లొంగదీసుకోవాలి : కంగనా రనౌత్

గురువారం, 6 మే 2021 (09:05 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లొంగదీసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. 
 
ఎన్నికల తర్వాత బెంగాల్ రాష్ట్రంలో హింస చెలరేగింది. అధికార టీఎంసీ, బీజేపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో హింస చెలరేగింది. ఈ అల్లర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ 2000వ సంవత్సరంలో ప్రదర్శించిన విశ్వరూపాన్ని మళ్లీ ప్రదర్శించి మమతను లొంగదీసుకోవాలని కంగన తన ట్వీట్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆ సంవత్సరంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. అనంతరం జరిగిన గోద్రా మారణకాండలో ఎంతోమంది ముస్లింలు మరణించారు. ఇప్పుడా విషయాన్ని కంగన పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ఆ పనిని మోడీనే చేయించారని ఆమె భావిస్తున్నట్టు ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె తెలిసి చేసినా, తెలియక చేసినా గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోడీపై వచ్చిన ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయని చెబుతున్నారు. 
 
అయితే, కంగనా ఈ సందర్భంగా మమతా బెనర్జీని రాక్షసితో పోల్చారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేసింది. గతంలోనూ ఆమె ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ఖాతా రద్దు కాలేదు కానీ, రద్దు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. 
 
అయితే, ఇప్పుడు మాత్రం ఆమె విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా మూసివేసింది. మరోవైపు, కంగన మాత్రం ట్విట్టర్ ఒక్కటే సర్వస్వం కాదని, తాను గొంతు విప్పేందుకు అనేక మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు