పవన్ మెచ్చుకున్నారు.. సావిత్రిగా నటించడం అంటే భయపడ్డా..: కీర్తి సురేష్

శనివారం, 14 అక్టోబరు 2017 (14:53 IST)
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా టాప్ హీరోయిన్ రేంజ్‌లో దూసుకెళ్తున్న కీర్తి సురేష్.. తాజాగా అలనాటి నటి సావిత్రి బయోపిక్‌లో నటిస్తోంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన కీర్తి సురేష్.. గ్లామర్ రోల్స్ చేయనంటే చేయనని చెప్తోంది. అందాలను ఒలకబోసే పాత్రలకి తాను నప్పనని తేల్చేసింది. అందుకే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ పాత్రలకు తాను దూరంగా వుంటానని చెప్పింది.
 
భవిష్యత్తులోను ఇదే మాటపై కట్టుబడి వుంటానని వెల్లడించింది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ సినిమాలోను, మహానటి మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పవన్‌ కల్యాణ్‌తో మూవీ చాలా స్పెషల్ అని కీర్తి సురేష్ తెలిపింది. 'మహానటి' తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆకాంక్షించింది.
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. తాను నటించిన భైరవ సినిమా గురించి పవన్ ప్రస్తావించారని.. ఆ సినిమాలో బాగా నటించానని మెచ్చుకున్నట్లు తెలిపింది. 
 
‘మహానటి’ సినిమాలో గురించి మాట్లాడుతూ.. మహానటి సావిత్రిలా నటించడం చాలా కష్టమైన విషయం. ఆమెలా నటించానని చెప్పడం కరెక్టు కాదు. ఈ సినిమా కోసమే సావిత్రి నటించిన సినిమాలను చూశా. సావిత్రి పాత్రలో నటించాలంటే తొలుత భయపడ్డానని తెలిపింది.

కానీ, సవాలుగా తీసుకుని ఆ పాత్రలో నటిస్తానని చెప్పాను. ‘మీరు మాత్రమే ఈ పాత్రకు వందశాతం నప్పుతారు’ అని ‘మహానటి’ నిర్మాత తనతో అన్నారని.. అంతేగాకుండా.. సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా అదే మాట చెప్పారని కీర్తి సురేష్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు