ప్రాజెక్టు ఆగదు.. 'భారతీయుడు' మీ ముందుకు వస్తాడు : లైకా ప్రొడక్షన్

శుక్రవారం, 8 మే 2020 (11:43 IST)
విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "భారతీయుడు-2". గతంలో వచ్చిన 'భారతీయుడు' (ఇండియన్) చిత్రానికి సీక్వెల్. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. 
 
అయితే, 'భారతీయుడు-2' చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారోగానీ... అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఒక్కోసారి ఒక్కో కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదాపడుతూ వస్తోంది.
 
చెన్నై నగర శివారు ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు. దీంతో కలత చెందిన చిత్ర నిర్మాతలు ఈ ప్రాజెక్టును నిలిపివేశారన్న పుకార్లు గుప్పుమన్నాయి. 
 
వీటిపై ప్రాజెక్టు నిర్మాతలు స్పందించారు. 'భారతీయుడు-2' చిత్రం షూటింగ్ ఇప్పటికే 60 శాతం మేరకు పూర్తయిందనీ, మిగిలిన 40 శాతం షూటింగ్ కరోనా లాక్‌డౌన్ తర్వాత పూర్తి చేస్తామని ప్రకటించారు. 
 
చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంటూ ఉండగా, ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో సమస్యలు తలెత్తడం .. కొన్ని ఆటంకాలు ఏర్పడటం సహజమేనని చెప్పారు. 
 
అంత మాత్రానికే పుకార్లకు ప్రాణం పోయడం భావ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోను ఈ ప్రాజెక్టు ఆగదు. భారతీయుడు-2 త్వరలోనే మీ ముందుకు వస్తాడు అంటూ చిత్ర నిర్మాతలు ఓ క్లారిటీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు