'జోకర్' పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న 'కత్తి'

మంగళవారం, 2 జనవరి 2018 (14:42 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఓ జోకర్ అని, ఆయనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి ఓ జోకర్‌లా ఆయన ఎంటర్ అయ్యారని, మోసపూరిత రాజకీయాలు, ఓట్లు చీల్చే రాజకీయాల్లో భాగంగానే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని దుయ్యబట్టాడు. రాజకీయంగా పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా, తాను కూడా అక్కడి నుంచే ఆయనపై పోటీకి నిలబడతానని... పవన్ దిగజారుడు రాజకీయాలను ఎండగడతానని చెప్పాడు. 
 
అంతేకాకుండా, తాను గత కొన్ని రోజులుగా తిక్క సేన, పిచ్చి సేనానితో తాను పోరాడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌పై గతంలో ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నప్పుడు కూడా పవన్ స్పందించలేదని... అలాంటి వ్యక్తి తనపై ఆయన అభిమానులు చేస్తున్న దాడి పట్ల స్పందిస్తారని తాను భావించడం లేదన్నాడు.
 
ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్ ఏ కామెంట్ పెట్టినా, ఏదైనా సినిమా రివ్యూ రాసినా... దానికిందంతా పవన్ కల్యాణ్ అభిమానుల బూతులు కనబడుతున్నాయని కత్తి మహేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. తనపై ప్రత్యక్షంగా దాడి జరుగుతున్నా పవన్ స్పందించడం లేదని వాపోయాడు. 'కత్తి మహేష్‌పై దాడిని ఆపండి' అంటూ పవన్ ఒక్క ట్వీట్ చేసినా... దీనికి ముగింపు పడుతుందని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు